Dr Nanduri Ramakrishna
Sr Sub EDITOR
విశాఖపట్నం, ఏప్రిల్ 11:- చట్టాలు, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగిందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక గౌరవప్రదమైన బాధ్యత అని ఆమె ఉద్ఘాటించారు. పోక్సో కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటూ,
నిందితులకు బెయిల్ లేకుండానే శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. శనివారం విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రాసిక్యూషన్ విభాగం ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా, బానిస కార్మిక వ్యవస్థ (రద్దు) చట్టం, 1976పై ఒక రోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ రామకోటేశ్వరరావుతో పాటు సుమారు 200 మంది ప్రాసిక్యూషన్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివిధ కేసుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సత్కరించారు. అవార్డు గ్రహీతలకు హోంమంత్రి అభినందనలు తెలిపారు.

ఈ వర్క్షాప్ సమాజానికి ఉపయోగపడేలా ఉందని ఆమె పేర్కొన్నారు. ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమంలో భాగంగా 900 మంది పిల్లలను రక్షించామని, విదేశాల్లో చిక్కుకున్న 180 మందిని సురక్షితంగా తిరిగి తీసుకువచ్చామని వివరించారు.
పోలీస్ శాఖలో నూతన సాంకేతికతతో శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.పోలీస్ మరియు న్యాయవ్యవస్థలు సమన్వయంతో పటిష్ఠంగా పనిచేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, అదే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.



Comments
Post a Comment