మానవత్వమే ఈశ్వరత్వము - పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా - ఘనంగా వైశాఖ మాస మహా సభ - ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు
హైదరాబాద్, ఏప్రియల్ 19 : మానవత్వమే ఈశ్వరత్వము అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ చేశారు. వైశాఖ మాసం సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం హైదరాబాద్ శాఖ సభ్యులు ఖైరతాబాద్ లోని వాసవి కల్యాణ మండపంలో వైశాఖ మాస మహా సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభకు విచ్చేసిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామికి హనుమంతుని వేషధారణ ధరించిన చిన్నారుల తమ నృత్యంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి పూర్వపు పీఠాధిపతుల చిత్ర పటాలకు నమస్కరించి, జ్యోతి ప్రజ్వలనతో సభను ప్రారంభించారు. చిన్నారులకు స్వామి ఆశీర్వాదాలు అందించి ప్రసాదం పంపిణీ చేశారు. సభలో బాల వికాస్ చిన్నారి అభినవ్ చంద్ర ప్రసంగిస్తూ పీఠం యొక్క విశిష్టతను సభకు వివరించారు. అదే విధంగా వైశాఖ మాస ప్రాముఖ్యతను తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు గిడుగు కాంతి కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్క మనిషికి కరుణ, ప్రేమ, జాలి ఉండాలన్నారు. గురువుల సందేశం, గురువుల ఆశీర్వాదం ప్రతీ ఒక్కరికీ అవసరమన్నారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి ఈశ్వర తత్వాన్ని బోధించడం చాలా అదృష్టమన్నారు. చిన్నారులకు ప్రేమ తత్వమే తెలుసని అటువంటి చిన్నారులకు ఇప్పటినుంచే గురుతత్వాన్ని అలవరుస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె స్వీయ రచన చేసిన వచన గేయాన్ని సభలో ఆలపించారు. యువ వికాస్ యువకులు సభలో "మానవత్వమే మతము" అనే నాటక ప్రదర్శన ప్రదర్శించారు. ఆ నాటకం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఉమా లక్ష్మి శ్రీ గీతాన్ని ఆలపించారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవలో భాగంగా మహిళా సాధికారత కార్యక్రమం ద్వారా మహిళ సునీతకు రూ.10వేలు చెక్కును ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా అందజేశారు. నిరుపేద విద్యార్థులకు వేసవి కాలం దృష్ట్యా వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. అనంతరం జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ రూపొందించిన యమునా నది పుష్కరాల పోస్టర్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణలో గిడుగు కాంతి కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ "మానవత్వమే ఈశ్వరత్వము మానవత్వమే మతము" అనేటటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని అనుసరించాలని కోరారు.
ప్రతి ఒక్కరూ నా మొక్క నా శ్వాస అనే కార్యక్రమంలో భాగంగా మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా బాధ్యతలు చేపట్టాలన్నారు. వేసవి దృష్ట్యా పశుపక్షాదుల కోసం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నూతనంగా విచ్చేసినటువంటి భక్తులకు మహా మంత్రం ఉపదేశించారు. కార్యక్రమానంతరం విచ్చేసినటువంటి భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మొత్తం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం హైదరాబాద్ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పిఆర్ఓ డాక్టర్ సునీల్ కుమార్ యాండ్ర తదితరులు పాల్గొన్నారు.
K.V.SHARMA EDITOR


Comments
Post a Comment