కెఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ లలో ఇంజనీరింగ్, ఇతర కోర్సులలో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు సోమవారం విశాఖపట్నంలో విడుదల చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష విధానాన్ని ప్రశంసించారు. పరీక్షల్లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నైపుణ్యం, సృజనాత్మకత, సామర్ధ్యం ఉన్న యువతను ప్రోత్సహించేలా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.సోషల్ మీడియా విషయంలో యువత చైతన్య వంతులుగా ఉండాలని, చెడు అంశాలకు దూరంగా ఉండి లక్ష్య సాధన పట్ల దృష్టి పెట్టాలని,తల్లితండ్రుల ఆకాంక్షలను నెరవేర్చటంతో రాష్ట్ర అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని స్పీకర్ పిలుపునిచ్చారు. యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా 100 కోట్ల రూపాయలను స్కాలర్షిప్స్ కింద కేటాయించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఇంజనీరింగ్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలను లక్షా 25 వేల మంది రాశారన్నారు. తమ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల్లో వచ్చిన ర్యాంకులతో పాటు ఇంటర్, జెఇఇ లలో వచ్చిన మెరిట్ ఆధారంగా విద్యార్థులకు మెరుగైన స్కాలర్షిప్ అందించేలా ప్రణాళిక చేసినట్లు తెలిపారు.ప్రపంచంలో ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని నిశితంగా పరిశీలిస్తూ పారిశ్రామిక అనుబంధ శిక్షణ అందిస్తున్నామన్నారు.
ఈ నెల 26 నుంచి 30 వ తేదీ వరకూ కౌన్సిలింగ్*కెఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ లలో ఇంజనీరింగ్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశాలకు సంబందించి ఈ నెల 26 వ తేదీ నుంచి 30 వ తేదీ వరకూ కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు వెల్లడించారు. కౌన్సిలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చన్నారు.


Comments
Post a Comment