Skip to main content

అబద్ధం–ఆరాచకమే జగన్ రాజకీయ సిద్ధాంతం… అభివృద్ధిని డైవర్ట్ చేసేందుకే మూడు నెలలకు ఒకసారి ప్రెస్‌మీట్* ▪️ *బాబాయి హత్య కేసులో జగన్ తడబాటు ఎందుకు…? నిజం బయటపడుతుందనే భయమే కారణం* ▪️ *ఐదేళ్ల కక్షసాధింపులు, శవ రాజకీయాలకు ప్రజలు ఇచ్చిన తీర్పే 11 సీట్లు* ▪️ *2029లో జగన్‌కు ప్రజలు శాశ్వత రాజకీయ సన్యాసం ఖాయం చేస్తారు* *-- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు*


అమరావతి, మే 23:* అబద్ధాలే ఆయుధంగా, అరాచకాలే రాజకీయంగా ముందుకు సాగిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో వస్తున్న సానుకూల స్పందనను మళ్లించేందుకే జగన్ రెడ్డి మూడు నెలలకు ఒకసారి ప్రెస్‌మీట్లు పెట్టి రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు.

*అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ డ్రామాలు*

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ… గత మూడు నెలల్లో రాష్ట్రానికి క్యారియర్, రాయల్ ఎన్‌ఫీల్డ్, AMCA వంటి ప్రతిష్ఠాత్మక పెట్టుబడులు వచ్చాయని, SAEL సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని, విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని గుర్తుచేశారు. రాయలసీమకు రూ.లక్ష కోట్లతో ఉద్యానవన హబ్ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ… రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకుపోతుంటే ఓర్వలేక జగన్ రెడ్డి ప్రెస్‌మీట్ పేరుతో గంటల తరబడి అసత్య ప్రచారం చేసి మళ్లీ బెంగళూరుకు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.

ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒక్క శాశ్వత అభివృద్ధి పని చేయని జగన్… ఇప్పుడు తానే రాష్ట్రాన్ని ఉద్ధరించానని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. అరాచకాలు, కక్షసాధింపులు, ఫ్యాక్షన్ రాజకీయాలు, శవ రాజకీయాలకు ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారని, అందుకే వైఎస్సార్సీపీని 11 సీట్లకే పరిమితం చేశారని పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధికి, విధ్వంసానికి మధ్య తేడాను స్పష్టంగా గుర్తించారని అన్నారు.

*బాబాయి హత్య కేసులో జగన్ తడబాటు ఎందుకు?*

బాబాయి హత్య కేసుపై జగన్ వైఖరిలోని తడబాటును ప్రజలు గమనిస్తున్నారని పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. “గుండెపోటు” అని మొదట చెప్పింది జగన్ కాదా? “నారాసుర రక్త చరిత్ర” అంటూ ప్రచారం చేసింది జగన్ కాదా? సీబీఐ విచారణ కోరింది కూడా జగన్ కాదా? ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు నిజాన్ని బయటపెట్టకుండా ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ అదే కేసును చంద్రబాబుపై నెట్టేందుకు ప్రయత్నించడం వెనుక అసలు భయం ఏమిటో ప్రజలకు అర్థమవుతోందన్నారు.

*శవ రాజకీయాలు వైఎస్సార్ కుటుంబానికే సొంతం*

తండ్రి శవం ఎదురుగా పెట్టుకుని రాజకీయాలు చేసిన చరిత్ర వైఎస్సార్ కుటుంబానిదేనని, ఇప్పుడు అదే రాజకీయ సంస్కృతిని కొనసాగిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నడుస్తోంది “రాజారెడ్డి రాజ్యాంగం” కాదని… డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగమని స్పష్టం చేశారు. ప్రజలు ఇక ఫ్యూడల్ రాజకీయాలను నమ్మే పరిస్థితిలో లేరని, 2029 ఎన్నికల్లో జగన్‌కు శాశ్వత రాజకీయ సన్యాసం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

                    K.V.SHARMA EDITOR 

Comments