Skip to main content

కాక్రోచ్ జనతా పార్టీ’ సోషల్ మీడియా ట్రెండ్‌ను రాజకీయంగా కాకుండా యువత ఆవేదన కోణంలో కూడా చూడాలి* *▪️ ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం* *-- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు*


 అమరావతి, మే 23:* సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అంశాన్ని కేవలం రాజకీయ కోణంలో కాకుండా యువత భావోద్వేగాలు, ఆవేదనల కోణంలో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ… దేశ యువత ఆశయాలు, ఉపాధి అవకాశాలు, పోటీ పరీక్షలు, ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో వ్యక్తమవుతున్న భావాలను ప్రజాస్వామ్య ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా స్వీకరించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎప్పుడూ యువత భవిష్యత్తు, ఉపాధి అవకాశాలు, ఆర్థికాభివృద్ధిపైనే దృష్టి సారిస్తున్నారని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగాల కల్పన, డిజిటల్ ఇండియా, స్టార్టప్స్, తయారీ రంగం, పారిశ్రామికాభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాల్లో ఎన్డీయే ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ తరహా భావోద్వేగాలను గమనించిన తర్వాత విధానాల్లో అవసరమైన మార్పులు, సవరణలు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామని పల్లా తెలిపారు. యువత ఆకాంక్షలు నెరవేరేలా విధాన నిర్ణేతల దృష్టికి అంశాలను తీసుకెళ్తామని చెప్పారు. “యువత మోసపోయామనే భావనకు గురికాకుండా… వారి ఆశయాలు నెరవేరేలా పాలన కొనసాగించడమే ప్రభుత్వ లక్ష్యం” అని స్పష్టం చేశారు.

*జాతీయ భద్రతపై అప్రమత్తత అవసరం*

సోషల్ మీడియా నియంత్రణ లేని వేదికగా మారుతున్న నేపథ్యంలో, కొన్ని సందర్భాల్లో విదేశీ శక్తులు లేదా సరిహద్దు ఆవల నుంచి ప్రభావం చూపే ప్రయత్నాలు జరిగే అవకాశాలను కూడా విస్మరించలేమని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అలాంటి అంశాలను సంబంధిత సంస్థలు సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ప్రతి విమర్శను దేశ వ్యతిరేక చర్యగా చూడటం కూడా సరైన విధానం కాదని వ్యాఖ్యానించారు.

*యువత ఆవేదనలను రాజకీయాలకు వాడుకోవద్దు*

ఉద్యోగాలు, పరీక్షలు, అవకాశాలపై యువతలో ఉన్న ఆందోళనలను కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకోవాలని చూస్తున్నాయని పల్లా విమర్శించారు. నిజమైన యువత సమస్యలను రాజకీయ ప్రచార సాధనాలుగా మార్చడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. యువత భావోద్వేగాలను అర్థం చేసుకుని పాలనా వ్యవస్థ మరింత బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజాస్వామ్యంలో విమర్శలను వినడం బలహీనత కాదని, అది పరిపక్వ నాయకత్వానికి నిదర్శనమని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. “భారత యువత దేశానికి వ్యతిరేకం కాదు… వారు అవకాశాలు, పారదర్శకత, వేగవంతమైన పాలన కోరుకుంటున్నారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తూ, జాతీయ భద్రతను కాపాడుతూ ముందుకు సాగడమే ఎన్డీయే ప్రభుత్వాల లక్ష్యం” అని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

                      K.V.SHARMA EDITOR 

Comments