జారీ చేసినవారు : డా. పి. జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం. తేది: 13.06.2026.
ఈరోజు అనగా తేదీ. 13.06.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు పత్రికాముఖంగా మాట్లాడుతూ పి.సి.పి.ఎన్.డి.టి. చట్టం ఉల్లంఘనపై సమాచారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వo టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1800 233 2447 నెంబర్ ను ఏర్పాటు చేసిందని తెలియచేసారు. ఆడ శిశువు హక్కుల పరిరక్షణ, లింగ వివక్ష నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు అమలులో ఉన్న ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ – నాటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్స్ చట్టం, 1994 ను సమర్ధవంతంగా అమలు చెయ్యడానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని తెలిపారు. `ప్రజల అభ్యర్ధనలను స్వీకరించేoదుకు రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1800 233 2447 ను అందుబాటులో ఉంచిందని తెలిపారు. గర్భంలోని శిశువు లింగాన్ని నిర్ధారించడం, లింగ నిర్ధారణ సేవలను ప్రచారం చేయడం, లింగ ఎంపికకు ప్రోత్సహించడం వంటి చర్యలు చట్ట విరుద్ధమైనవని, ఇటువంటి కార్యకలాపాలు సమాజంలో లింగ అసమానతలను పెంచడమే కాకుండా ఆడ శిశువుల జనన నిష్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
గర్భస్థ శిశువు లింగ నిర్ధారణకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలు
లింగ నిర్ధారణ సేవలు ప్రకటనలు
అనుమతి లేని స్కానింగ్ లేదా డయాగ్నొస్టిక్ కేంద్రాలు
లింగ ఎంపికను ప్రోత్సహించే ఏ విధమైన చర్యలు ఉన్నా సమాచారాన్ని హెల్ప్ లైన్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. హెల్ప్ లైన్ ద్వారా అందిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, సంబందిత అధికారులచే తగిన విచారణ జరిపి చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆడ శిశువును రక్షించడం ప్రతి పౌరుని భాద్యత అని, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, వైద్య నిపుణులు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు అందరూ కలిసి పి.సి.పి.ఎన్.డి.టి. చట్టం అమలుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి,
విశాఖపట్నం
.

Comments
Post a Comment