Skip to main content

ఇంట‌ర్ డిసిప్లీన‌రీ రీసెర్చ్‌కి ప్రాధాన్య‌త ఇవ్వండి సంయుక్తంగా ప‌రిశోధ‌న ప్రాజెక్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయాలి ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్

K.V.SHARMA EDITOR 
ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, జూలై 9:
విశ్వ‌విద్యాల‌యంలో విభిన్న విభాగాల ఆచార్యులు సంయుక్తంగా ఇంట‌ర్ డిసిప్లీన‌రీ రిసెర్చ్‌కి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ సూచించారు. గురువారం ఇంజ‌నీరింగ్ క‌ళాశాల గౌత‌మ‌బుద్ద ఆడిటోరియంలో విశ్వ‌విద్యాల‌య ఆచార్యుల‌తో ఆయ‌న మాట్లాడారు. సంయుక్తంగా ప‌రిశోధ‌న ప్రాజెక్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయాల‌ని సూచించారు. అదే విధంగా ఆచార్యులు, ప‌రిశోధ‌కులు అంత‌ర్జాతీయ స‌దస్సుల‌లో పాల్గొనే విధంగా ఆర్ధిక స‌హ‌కారాన్ని అందించే ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టే ఆలోచ‌న ఉంద‌న్నారు. విద్యాసంవ‌త్స‌రం ప్రారంభం అవుతున్న నేప‌ధ్యంలో త‌ర‌గ‌తి గ‌దిలో మౌళిక స‌దుపాయాలు, ప‌రిశుభ్ర‌త‌కు ప్ర‌త్యేశ శ్ర‌ద్ద వ‌హించాల‌న్నారు. ప్ర‌తీ త‌ర‌గ‌తి గ‌దిలో అవ‌స‌ర‌మైన స్మార్ట్ బోర్డులు ఇత‌ర మౌళిక స‌దుపాయాలు స‌రిచూసుకోవాల‌న్నారు. అవ‌స‌ర‌మైన విభాగాల‌కు త‌గిన మౌళిక వ‌స‌తుల‌ను క‌ల్పించడం జ‌రుగుతుంద‌న్నారు. అదే విధంగా ప్ర‌త్యేకంగా నియ‌మించిన పారిశుధ్య సిబ్బందితో విభాగాలు, త‌ర‌గ‌తి గ‌దులు, టాయిలెట్స్ ఉద‌యం, సాయంత్రం శుభ్రం చేయించాల‌న్నారు. ప‌రిశుభ్ర‌మైన‌, ఆహ్లాద‌క‌ర‌మైన ప‌రిస‌రాల‌ను తీర్చిద్ద‌డంలో శ్ర‌ద్ద వ‌హించాల‌న్నారు. ప్ర‌తీ విభాగంలో అత్యుత్త‌మ జ‌ర్న‌ల్స్‌, అంత‌ర్జాతీయ స‌ద‌స్సుల లిస్ట్‌ను త‌యారు చేసుకోవాల‌ని సూచించారు.


విద్యార్థుల‌కు ఉపాధి క‌ల్ప‌న‌పై విభాగ స్థాయి నుంచి ప్ర‌త్యేక శ్ర‌ద్ద వ‌హించాల‌న్నారు. ప్ర‌తీ ఆచార్యులు త‌మ‌కు తెలిసిన ప‌రిశ్ర‌మ‌ల వివ‌రాలు అందించాల‌ని, వారిని విశ్వ‌విద్యాల‌యానికి ఆహ్వానిస్తామ‌న్నారు. విద్యార్థుల‌కు మెరుగైన ఉపాధి అవ‌కాశాలు క‌ల్ప‌న ల‌క్ష్యంగా ప‌నిచేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. దీనికోసం ప్ర‌తీ విభాగం నుంచి ఒక ఆచార్యుడిని స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా, విద్యార్థుల నుంచి స‌మ‌న్వ‌యం చేయ‌డానికి ఒక‌రిని ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. 


విభాగాల‌లో నిర్వ‌హించే వివిధ కార్య‌క్ర‌మాల‌కు మీడియా, సామాజిక మాధ్య‌మాల‌లో విస్తృత ప్రాచుర్యం క‌ల్పించే ప్ర‌ణాళిక‌ను సిద్దం చేస్తున్నామ‌న్నారు. ఇన్నోవేష‌న్‌ను సైతం ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. విభాగాల‌లో నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌ను బ్రాండింగ్‌-మీడియా కార్యాలయంతో స‌మ‌న్వ‌యం చేస్తూ, స‌మాచారం అందించాల‌న్నారు. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన స్టార్ట‌ప్ ఫండింగ్ కార్య‌క్ర‌మానికి విద్యార్థుల నుంచి 32 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని వాటినుంచి అత్యుత్త‌మ‌మైన‌వి ఎంపిక చేసి రూ 5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆర్ధిక తోడ్పాటును అందిస్తామ‌న్నారు.

కార్య‌క్ర‌మంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ప్రిన్సిపాల్స్‌, విభాగాధిప‌తులు, ఆచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Comments