శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం, సింహాచలం. సింహాచలం దేవస్థానంలో రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ కార్యదర్శి కె. కన్నబాబు పర్యటన గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కార్యదర్శి
K.V..SHARMA EDITOR
సింహాచలం, జూలై 24, 2026: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి కె. కన్నబాబు శుక్రవారం సింహాచలం శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు, సహాయ కార్య నిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు నాదస్వరం, వేదమంత్రాల నడుమ కె. కన్నబాబుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం, బేడా మండపం ప్రదక్షిణ అనంతరం స్వామివారి దర్శనం కల్పించారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, ఈవో జల్లేపల్లి వెంకటరావు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
అనంతరం ఈవో జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు సంబంధించి దేవస్థానం చేపడుతున్న ఏర్పాట్లను కె. కన్నబాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కియోస్క్ మిషన్ల పనితీరును పరిశీలించడంతో పాటు, ‘మనమిత్ర’ సేవ ద్వారా స్వయంగా టికెట్ బుక్ చేసి డిజిటల్ సేవల పనితీరును పరిశీలించారు.
కొండ పైన మంచినీటి పాయింట్లను పరిశీలించి భక్తులకు తగినంత మంచినీరు అందుబాటులో ఉందా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అన్నదానం భవనానికి వెళ్లే మార్గంలోని వాష్రూమ్లను కూడా స్వయంగా పరిశీలించి పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా దర్శనం పూర్తిచేసుకున్న భక్తులతో కె. కన్నబాబు నేరుగా మాట్లాడి దర్శనానికి ఎంత సమయం పట్టింది, దర్శన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పారిశుద్ధ్య సదుపాయాలు, మంచినీటి వసతి తదితర అంశాలపై ఆరా తీశారు. దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలు బాగున్నాయని భక్తులు వెల్లడించడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం స్వామివారి నిత్య అన్నప్రసాద భవనాన్ని సందర్శించిన ఆయన భక్తులతో కలిసి భోజన సదుపాయాలను పరిశీలించారు. భోజనం, కూరలు ఎలా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాదం సంతృప్తికరంగా ఉందని భక్తులు చెప్పడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, భక్తుల సౌకర్యాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు.
ఈ పర్యటనలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, దేవస్థానం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment