Skip to main content

మత్స్యకారుల భద్రతకు ఆధునిక సాంకేతికతను వినియోగించాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్

.              D.S.VARMA Sr Sub EDITOR 
విశాఖపట్నం, జూలై 7: విశాఖపట్నంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సముద్ర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు శ్రీ కారి చిన్నాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈరోజు పరామర్శించారు.

ఈ సందర్భంగా కారి చిన్నా చెప్పిన ఘటన వివరాలు తనను తీవ్రంగా కలచివేశాయని పీవీఎన్ మాధవ్ తెలిపారు. సముద్రంలో బోటు గల్లంతైన విషాద ఘటనలో ప్రాణాలతో బయటపడినప్పటికీ, తనతో పాటు వేటకు వెళ్లిన తోటి మత్స్యకారులు, కుటుంబ సభ్యులు గల్లంతయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేసిన తీరు హృదయ విదారకమని పేర్కొన్నారు.

ఈ దుర్ఘటనలో గల్లంతైన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చినట్లు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.


భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మత్స్యకారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పీవీఎన్ మాధవ్ అన్నారు. వేటకు వెళ్లే ప్రతి బోటుకు జియోట్యాగింగ్, జీపీఎస్ ట్రాకింగ్, అత్యవసర సమాచార వ్యవస్థలు, శాటిలైట్ కమ్యూనికేషన్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మత్స్యకారుల ప్రాణాల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో మరింత బలమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పరుశురామరాజు, గాజువాక కన్వీనర్ శ్రీ కరణంరెడ్డి నరసింగరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు

Comments