ఆంధ్రవిశ్వవిద్యాలయం,జూలై 27:ఆంధ్రవిశ్వవిద్యాలయం అణుభౌతిక శాస్త్ర విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వామి జ్ఞానానంద అడ్వాన్స్డ్ నూక్లియర్ రీసెర్చ్ లేబరేటరీని సోమవారం ఉదయం ప్రారంభించారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ అతిధులతో కలిసి లాబరేటరీని ప్రారంభించారు. ఈ సందర్బంగా వీసీ ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ నూతనంగా అభివృద్ది చేసిన లాబరేటరీ విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ, నైపుణ్యాలను అందించే వేదికగా నిలుస్తుందన్నారు. విభాగ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానానంద, ఇతర ఆచార్యులు సమాజ ఉపయుక్తంగా ఎన్నో పరిశోధనలు జరిపారన్నారు. విభాగాన్ని మరింత బలోపేతం చేసే విధంగా మరిన్ని నూతన ప్రయోగ ఉపకరణాలను తీసుకువస్తామన్నారు. విద్యార్థులకు ఇంటర్న్షిప్ సైతం అందించే విధంగా సహకారం అందించడానికి ముందుకువచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
విభాగాధిపతి ఆచార్య పి.వి లక్ష్మి నారాయణ మాట్లాడుతూ పర్యారవణంలో ఉన్న రేడియో ధార్మికతను గుర్తించడానికి ఈ లాబరేటరీ ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ అందించడం వలన వారు కోర్సు పూర్తిచేసే సమయానికి విభిన్న ప్రయోగశాలలో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాలు లభిస్తాయన్నారు. నీరు, గాలి, నేలలో ఉన్న రేడియో ధార్మికత స్థాయిలను గుర్తించే అవకాశం ఉందన్నారు. ఆల్ఫా రే, బీటా రే, గామా రే స్పెక్ట్రోమీటర్లు, రాడాన్ సర్వే మీటర్ అందుబాటులోకి వచ్చాయన్నారు.
కార్యక్రమంలో మోడరన్ టెస్ట్ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్(బర్హంపూర్) రాజేంద్ర మిశ్ర, బార్క్ విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ డి.విద్య సాగర్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు , సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఏం.వి.ఆర్.రాజు, విభాగ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విభాగం వద్దనున్న స్వామి జ్ఞానానంద విగ్రహానికి పూలమాలవు వేసి అంజలి ఘటించారు



Comments
Post a Comment