అల్లవరం, విశాఖ సందేసం...డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ, అమరావతి ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైన తర్వాత సుమారు 16 వేల ఖాళీ పోస్టులు ఇప్పటికీ భర్తీ చేయలేదని, దీంతో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడిందని తెలిపారు. స్త్రీ శక్తి పథకం అమలులోకి వచ్చిన తర్వాత రోజుకు సుమారు 15 లక్షల మంది మహిళా ప్రయాణికులు అదనంగా ప్రయాణిస్తున్నప్పటికీ, దానికి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చలేదని పేర్కొన్నారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికుల రద్దీకి సరిపడా బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల దృష్ట్యా కనీస అవసరాల కోసం 4,000 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని కోరారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ వల్ల ఆర్టీసీకి కలుగుతున్న ఆర్థిక భారాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో 12వ వేతన సంఘం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని, మూడు సంవత్సరాలు దాటినా కమిటీ ఏర్పాటు చేయకపోవడం, మధ్యంతర ఉపశమనం (IR) ప్రకటించకపోవడం, పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే చర్యలను నిలిపివేయాలని, మూసివేసిన ఆర్టీసీ డిపోలను తిరిగి ప్రారంభించాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు, పీఎఫ్ తదితర చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ స్పందిస్తూ, ఆర్టీసీ ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలు ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి సంబంధించినవని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఉద్యోగులు మరియు ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడేలా శాసన మండలిలో బలంగా ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో
ఆర్టీసి జేఏసి నాయకులు ఎం.ఆర్ కృష్ణ,పందిరి రాంబాబు జె.సింహాద్రి,ఎస్ ఎస్ నారాయణ,జంగా నాగేశ్వరరావు ,శ్రీనివాస్ తధితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment