చారిత్రాత్మక ఘట్టంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి* *ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి *అధికారులు, ప్రజా ప్రతినిధులతో హోం మంత్రి వంగలపూడి అనిత
విశాఖపట్నం, జూలై 25 ః ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్షకు ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఈ ప్రాంత అభివృద్ధి చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆగస్టు 1న జరగనున్న ఈ మహా క్రతువులో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కలెక్టరేట్ మీటింగు హాలులో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె పలు అంశాలపై ఎమ్మెల్యేలకు, అధికారులకు సూచనలు చేశారు.
ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రజలందరూ తమ వేడుకగా భావించి భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, స్వచ్ఛందంగా వచ్చే ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన ప్రయాణం, తాగునీరు, ఆహారం, భద్రత తదితర ఏర్పాట్లు ఉండేలా అధికారులు సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వచ్ఛందంగా హాజరయ్యే ప్రజలకు రవాణా సౌకర్యం సజావుగా ఉండేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని హోం మంత్రి సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని బస్సుల రూట్ మ్యాప్, సమయ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. అన్ని బస్సులు ఉదయం 9 గంటలకల్లా భోగాపురం చేరుకునేలా, ఆయా ప్రాంతాల దూరం, రహదారి పరిస్థితులను బట్టి ఉదయం 6 గంటల నుంచే వేర్వేరు సమయాల్లో బయలుదేరేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఒక్కో గ్రామం, మండలం, రూట్ వారీగా సమన్వయ బాధ్యతలు స్పష్టంగా ఉండేలా అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పరం సమన్వయం చేసుకోవాలన్నారు. బస్సుల రూట్ మ్యాప్, సమయాలు, ప్రయాణ వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. ప్రజల సాధారణ రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించాలని హోం మంత్రి ఆదేశించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో ఏర్పడే కొత్త అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని హోం మంత్రి సూచించారు. ఉపాధి, పెట్టుబడులు, పర్యాటకం, వ్యాపారం, విమానయానం తదితర రంగాల్లో రానున్న అవకాశాలపై యువత, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
*31న విశాఖలో మారథాన్, బీచ్ వాక్*
ఈ నేపథ్యంలో ఆగస్టు 31న విశాఖపట్నంలో భవిష్యత్ అవకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా మారథాన్ రన్, బీచ్ వాక్, ఫ్లాష్ మాబ్, 5కే రన్ లేదా సైక్లింగ్ వంటి కార్యక్రమాలను నిర్వహించేలా సంబంధిత శాఖలు కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు. తగిన ప్రణాళికలు రూపొందించామని, కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు కొత్త ద్వారాలు తెరచే ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు.

Comments
Post a Comment