లాంఛనంగా 102 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ప్రారంభంగర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు ఉచిత రవాణా సేవలు *ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజులతో కలిసి ప్రారంభించిన జేసీ జి. విద్యాధరి*
విశాఖపట్నం, ఆగస్టు 11: గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, సకాలంలో వైద్య సేవలు అందించడంతో పాటు మాతా-శిశు ఆరోగ్య సంరక్షణను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘102 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను మంగళవారం జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి లాంఛనంగా ప్రారంభించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భాగస్వామ్యమై జెండా ఊపి వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు మరణాల రేటును తగ్గించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలను ప్రోత్సహించడం, ప్రసవానంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడం, పేద కుటుంబాలపై రవాణా వ్యయ భారాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలను, వారి నవజాత శిశువులను ఇద్దరు సహాయకులతో కలిసి పూర్తిగా ఉచితంగా ఇంటి వద్దకు చేర్చే పోస్ట్నేటల్ డ్రాప్బ్యాక్ సౌకర్యాన్ని ‘102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్’ ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. అలాగే హై-రిస్క్ ప్రెగ్నెన్సీ మహిళలు, తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు ఐరన్ సుక్రోజ్ చికిత్సలు, ప్రత్యేక వైద్య పరీక్షలు, రక్త మార్పిడి వంటి అత్యవసర వైద్య అవసరాల కోసం ఆసుపత్రులకు ఉచితంగా తరలించి తిరిగి ఇంటికి చేర్చే సేవలను కూడా ఈ వాహనాల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలుకు విశాఖపట్నం జిల్లాకు 16 అత్యాధునిక వాహనాలు కేటాయించారని జేసీ వివరించారు. ప్రస్తుతం జిల్లాలో కింగ్ జార్జ్ ఆసుపత్రి వద్ద 9, అగనంపూడి వద్ద 2, విక్టోరియా ఆసుపత్రి వద్ద 5 వాహనాలు అందుబాటులో ఉంచి సేవలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాహనాల్లో రియర్ సీట్ బెల్టులు, ఎయిర్బ్యాగ్లు, అగ్నిమాపక పరికరాలు, ఎయిర్ కండీషనింగ్, మొబైల్ ఛార్జింగ్ సదుపాయం, హ్యాండ్ శానిటైజర్, టిష్యూ పేపర్లు, డస్ట్బిన్ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా రియల్టైమ్ జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ, అత్యవసర పరిస్థితుల్లో కాల్ సెంటర్కు సమాచారం చేరవేసే ఎమర్జెన్సీ అలర్ట్ స్విచ్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో తల్లి-శిశు ఆరోగ్యం, శిశు పోషణ, ప్రసవానంతర సంరక్షణకు సంబంధించిన అవగాహన సందేశాలను ప్రసారం చేసే ప్రత్యేక ఆడియో వ్యవస్థను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ సేవలు పూర్తిగా ఉచితమని, లబ్ధిదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవర్లకు రుసుములు లేదా టిప్పులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో 2025-26 సంవత్సరంలో 24 వాహనాల ద్వారా 9,988 మంది లబ్ధిదారులు సేవలు పొందగా, 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 3,274 మంది ఈ సేవలను వినియోగించుకున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. పి. జగదీశ్వరరావు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఐ. వాణి, కేజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ బి.వి. రమణ, విక్టోరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. పి. ఉష, డీసీహెచ్ఎస్ డా. నరేంద్ర సింగ్, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కో-ఆర్డినేటర్ డా. అప్పారావు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
..



Comments
Post a Comment