గౌరవ ప్రధానమంత్రి 'నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్' జాతీయ కార్యక్రమ ప్రారంభోత్సవంలో వర్చ్యువల్ గా పాల్గొన్న శ్రీ సత్యసాయి విద్యా విహార్, విశాఖపట్నం
దేశవ్యాప్తంగా ఈ రోజు 10 వేలకుపైగా కేంద్రాల నుంచి లక్షలాది మంది యువత వర్చువల్గా పాల్గొన్నారు. 125కుపైగా ఆధ్యాత్మిక సంస్థలు, మై భారత్ వాలంటీర్లు, నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) వాలంటీర్లు, యువజన సంఘాలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల యువజన విభాగాలు ఈ జాతీయ కార్యక్రమంలో భాగస్వాములై మాదకద్రవ్య రహిత భారత నిర్మాణానికి తమ మద్దతు ప్రకటించాయి.
ఈ కార్యక్రమం ద్వారా "మాదకద్రవ్య రహిత యువతే వికసిత భారతానికి బలమైన పునాది" అనే సందేశాన్ని దేశవ్యాప్తంగా యువతకు గౌరవ దేశ ప్రధాని చాటిచెప్పారు.
*శ్రీ సత్య సాయి విద్యా విహార్ స్కూలు ప్రాంగణం నుంచే ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్న విద్యార్థులు, దేశవ్యాప్తంగా వేలాది మంది యువతతో కలిసి మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ఆరోగ్యవంతమైన, విలువలతో కూడిన వికసిత భారత నిర్మాణానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని ప్రతిజ్ఞ చేశారు.*
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, "మాదకద్రవ్య రహిత భారత నిర్మాణంలో యువత కీలకపాత్ర పోషించాలని, దేశ బలం యువతలోని వ్యక్తిత్వం, క్రమశిక్షణ, సంకల్పబలంలోనే నిక్షిప్తమై ఉందని" పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ మహత్తర ఉద్యమం ద్వారా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి వికసిత్ భారత్ నిర్మాణంలో చైతన్యవంతులైన భాగస్వాములుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి శ్రీ సత్యసాయి విద్యావిహార్ ఎంపిక కావడం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రవచించిన 'ఎడ్యుకేర్' తత్వాన్ని ఆచరణలో అమలు చేస్తూ, విద్యతో పాటు మానవ విలువలు, ఉత్తమ వ్యక్తిత్వం, క్రమశిక్షణ, సేవాభావాన్ని విద్యార్థుల్లో పెంపొందిస్తున్న పాఠశాల నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది*.
ఈ జాతీయ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తమ పాఠశాలతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
దేశ ప్రధాని తో జాతీయ కార్యక్రమానికి ముందుమాటగా శ్రీ సత్యసాయి విద్యావిహార్లో విద్యార్థుల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ, ఆరోగ్యవంతమైన, విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవరచుకునేలా ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు*.
అనంతరం మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, బాధ్యతాయుతమైన నిర్ణయాల ప్రాముఖ్యతపై *విద్యార్థులు "వికసిత్ భారత్" అంశంపై సంగీత బృందం ఆలపించిన ప్రేరణాత్మక గీతం విద్యార్థుల్లో దేశాభివృద్ధి పట్ల స్ఫూర్తిని నింపగా, నుక్కడ్ నాటక్ ద్వారా మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తి, కుటుంబం, సమాజంపై చూపే వినాశకర ప్రభావాన్ని హృద్యంగా ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు చేసిన జ్యోతి ధ్యానం, యోగాసనాల ప్రదర్శనలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ధ్యానం, స్వీయ క్రమశిక్షణ, యోగా ద్వారా అంతర్గత శక్తిని పెంపొందించుకొని చెడు అలవాట్లను అధిగమించవచ్చనే సందేశాన్ని ఈ కార్యక్రమాలద్వారా విద్యార్థులు అందించారు*.
అనంతరం జరిగిన సభలో శ్రీ సత్యసాయి విద్యావిహార్ *పూర్వ ప్రిన్సిపాల్ శ్రీమతి అయ్యగారి కౌసల్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, మాదకద్రవ్య రహిత భారతానికి యువత రాయబారులుగా మారాలని, మానవ విలువలను ఆచరిస్తూ ఉత్తమ వ్యక్తిత్వం, క్రమశిక్షణ, నిస్వార్థ సేవాభావంతో వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు*
ఈ కార్యక్రమంలో *శ్రీ సత్య సాయి విద్యా విహార్ గవర్నింగ్ బాడీ సభ్యులు శ్రీమతి బి. శ్రీదేవి, శ్రీ పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు, శ్రీ వి.ఆర్. నాగేశ్వరరావు, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి చేకూరి వరలక్ష్మి*, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.













Comments
Post a Comment