విశాఖపట్నం :విశాఖ సందేశం వర్తవాహని :ఆగస్టు 20, 2026: సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ (స్వయంప్రతిపత్తి), విశాఖపట్నంలో “Millets to Models: Natural and Sustainable Farming for the 21st Century” అనే అంశంపై ఒకరోజు సదస్సును ఆగస్టు 22న సెమినార్ హాల్–1లో నిర్వహించనున్నారు. వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి, వృక్షశాస్త్రం, బయోటెక్నాలజీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది.
కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ పి.డి. సదస్సు బ్రోషర్ను ఆవిష్కరించి మాట్లాడుతూ, సహజ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు ద్వారా రసాయన రహిత, వాతావరణ మార్పులను తట్టుకునే, రైతులకు ఆదాయ భద్రత కల్పించే వ్యవసాయాన్ని ప్రోత్సహించడం సదస్సు ప్రధాన లక్ష్యమని తెలిపారు. చిరుధాన్యాల సాగు ద్వారా లభించే పోషక, పర్యావరణ, ఆర్థిక ప్రయోజనాలతో పాటు సుస్థిర వ్యవసాయ పద్ధతులపై పరిశోధకులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, అధ్యాపకులు, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు.
సహజ వ్యవసాయం, చిరుధాన్యాల ఆధారిత పంట నమూనాలు, డిజిటల్ బ్రీడింగ్, జన్యు వైవిధ్యం, సుస్థిర పంట ఉత్పత్తి తదితర అంశాలపై నిపుణులతో చర్చించేందుకు ఈ సదస్సు వేదికగా నిలవనుంది. పంటల ఉత్పాదకతను పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఆహార మరియు పోషక భద్రతకు దోహదపడే వినూత్న వ్యవసాయ విధానాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.సదస్సుకు కె. ప్రకాశ్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు; శ్రీమతి బి. సత్య శ్యామల, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, APCNF, విశాఖపట్నం; డా. వై. సంధ్యారాణి, శాస్త్రవేత్త, ARS–విజయనగరం; ఎన్. అనురాధ, సీనియర్ శాస్త్రవేత్త (ప్లాంట్ బ్రీడింగ్), ARS–విజయనగరం; డా. వాన ప్రసాదరావు, శాస్త్రవేత్త–వ్యవసాయ శాస్త్రం, BCT–కొవ్వూరు వనరుల వ్యక్తులుగా పాల్గొని సహజ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు, జన్యు వైవిధ్యం, డిజిటల్ బ్రీడింగ్, సేంద్రియ మరియు సహజ వ్యవసాయ పద్ధతులపై ప్రసంగించనున్నారు.
డా. ఎం. పద్మ సుందరి, సహాయ ఆచార్యులు, వృక్షశాస్త్ర విభాగం, సదస్సు కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. డా. ఎ. వీరబ్రహ్మం, విభాగాధిపతి, బయోటెక్నాలజీ విభాగం, మరియు శ్రీ కె. శ్రీను, విభాగాధిపతి, వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి విభాగం, కో-కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు.విద్యార్థులు, యువ పరిశోధకులు సుస్థిర వ్యవసాయ పరిష్కారాలపై దృష్టి సారించేలా ప్రోత్సహించడం, సంప్రదాయ వ్యవసాయ పరిజ్ఞానం, శాస్త్రీయ పరిశోధన, ఆధునిక సాంకేతికతలను సమన్వయం చేసి పర్యావరణహితమైన, స్థిరమైన వ్యవసాయ భవిష్యత్తుకు బాటలు వేయడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.



Comments
Post a Comment