విశాఖ జిల్లా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ శ్రీ అభిషిక్త్ కిషోర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ శంఖ బ్రత భాగ్చి జాయింట్ కలెక్టర్ శ్రీమతి విద్యాధరి , జిల్లా అధికారులు, పోలీసు శాఖ అధికారులు మరియు ఏపీఎస్ఆర్టీసీ అధికారుల సమక్షంలో విశాఖ జిల్లాకు నూతనంగా వచ్చిన రెండు ఎలక్ట్రిక్ బస్సులను రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీభరత్ ప్రారంభించారు.
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎలక్ట్రిక్ బస్సులను అతి త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చినందుకు మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులను, సిబ్బందిని అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ఏడాది ఆగస్టు 15న విశాఖ జిల్లాలో శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగిందని, ఇప్పటివరకు విశాఖ జిల్లాలో సుమారు రూ.230 కోట్ల విలువైన ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహిళలకు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో మహిళా ప్రయాణికులు విశాఖ జిల్లాలో ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారని, వారి ప్రయాణ శాతం గణనీయంగా పెరగడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా రీజినల్ మేనేజర్ శ్రీ బి.అప్పల నాయుడు తో పాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బందిని అభినందించారు.
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 20 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో 10 బస్సులు గాజువాక నుంచి NAD–మద్దిలపాలెం హైవే మీదుగా, మరో 10 బస్సులు సంధ్య థియేటర్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఐటీ పార్క్ తదితర ప్రాంతాల మీదుగా నడుస్తున్నాయని తెలిపారు. గాజువాక నుంచి, విమానాశ్రయం నుంచి కూడా ప్రతి గంటకు బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని వివరించారు.
విమానాశ్రయానికి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రూ.300, గాజువాక నుంచి రూ.400 మాత్రమే ఛార్జీగా నిర్ణయించామని, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, ఎంపీ శ్రీ శ్రీభరత్ గారు కోరారు.
అనంతరం ప్రారంభించిన ఎలక్ట్రిక్ బస్సుల్లో మంత్రివర్యులు, ఎంపీ శ్రీ శ్రీభరత్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ అభిషిక్త్ కిషోర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ శంఖ బ్రత భాగ్చి గారు, జాయింట్ కలెక్టర్, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు మరియు ఆర్టీసీ అధికారులు ప్రయాణించి పోలీస్ గ్రౌండ్స్ నుంచి ఆర్కే బీచ్ వరకు బస్సు ప్రయాణాన్ని నిర్వహించారు.
పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులు విశాఖ నగర ప్రజలకు, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, చౌకైన ప్రజా రవాణా సేవలను అందించనున్నాయని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.



Comments
Post a Comment