శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. * భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం గా కొండపై రెండో రోజు ప్రత్యేక పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ డ్రైవ్ * ఫ్రీ క్యూ లైన్లు, వాష్రూమ్లు, తాగునీటి వసతులు, అన్నదానం–లడ్డూ ప్రసాదాల నాణ్యతపై ఈవో జల్లేపల్లి వెంకట్రావు ప్రత్యేక పరిశీలన.
సింహాచలం, 12 ఆగస్టు 2026:శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ ఈవో జల్లాపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో కొండపై రెండో రోజు ప్రత్యేక పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ డ్రైవ్ నిర్వహించారు.
సానిటరీ, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఈవో, భక్తుల సౌకర్యాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, క్యూ లైన్లు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా ఫ్రీ క్యూ లైన్లను పరిశీలించిన ఈవో, క్యూ లైన్లకు ఆనుకుని ఉన్న వాష్రూమ్లను స్వయంగా పరిశీలించారు. వాష్రూమ్లలో క్లీనింగ్, తలుపులు, గడియలు తదితర వాటిని సరిచేయడంతో పాటు అవసరమైన చిన్నచిన్న మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వాష్రూమ్ల వద్ద భక్తులకు స్పష్టంగా కనిపించే విధంగా అవసరమైన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు.
క్యూ లైన్లకు ఆనుకుని ఉన్న వాటర్ కూలర్లను ఈవో పరిశీలించారు. కొత్తగా కొనుగోలు చేసిన వాటర్ డిస్పెన్సర్లను ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి, వాటిని తక్షణమే భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత వాటర్ ఏఈని ఆదేశించారు.
ఉచిత ప్రసాదాల పంపిణీ కేంద్రం, వేద పాఠశాల, కేశఖండనశాల తదితర భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా అవసరమైన వాటర్ డిస్పెన్సర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
భక్తులకు తాగునీరు అందించే స్టీల్ డ్రమ్ములను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, ప్రతిరోజూ శుభ్రపరిచిన వివరాలను నమోదు చేసే విధంగా ప్రత్యేక రిజిస్టర్ను నిర్వహించాలని వాటర్ ఏఈని ఆదేశించారు.
ఆలయ పరిసరాల్లో పేరుకుపోయిన అనవసర, వినియోగంలో లేని వస్తువులను వెంటనే తొలగించి, వాటిని స్క్రాప్కు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలు ఎక్కడా అపరిశుభ్రంగా కనిపించకుండా నిరంతరం పర్యవేక్షించాలని సానిటరీ సిబ్బందికి సూచించారు.
అన్నదానం భవనానికి సమీపంలోని వాష్రూమ్లను ఈవో స్వయంగా లోపలికి వెళ్లి పరిశీలించారు. అక్కడ కొత్త బకెట్లు, జగ్గులు ఏర్పాటు చేయడంతో పాటు వాష్రూమ్లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అన్నదానం భవనం చుట్టుపక్కల ఉన్న సిమెంట్, ఇటుకలు, పనికిరాని ఇతర వస్తువులను వెంటనే తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సానిటరీ సిబ్బందికి సూచించారు.
అన్నప్రసాదం నాణ్యతపై స్వయంగా పరిశీలనఅన్నదానం భవనంలో భక్తులకు అందిస్తున్న స్వామివారి అన్నప్రసాదాన్ని ఈవో పరిశీలించారు. అక్కడ తయారు చేసిన టమాటా పచ్చడి, అరటికాయ కూర, పప్పు, ఆకుకూర, సాంబారు తదితర పదార్థాలను స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించారు.
అక్కడ భోజనం చేస్తున్న భక్తులను అన్నప్రసాదం నాణ్యతపై అడిగి తెలుసుకోగా, అన్నప్రసాదం రుచికరంగా, బాగుందని భక్తులు పేర్కొన్నారు. దీంతో ఈవో సంతృప్తి, ఆనందం వ్యక్తం చేశారు.
స్వామివారి నివేదనకు, అన్నప్రసాదానికి ఉపయోగించే నిత్యావసర సరుకుల స్టోర్ను కూడా ఈవో పరిశీలించారు. అన్నదానం భవనంలో చేపట్టాల్సిన అదనపు పనులపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబుతో చర్చించారు.
అన్నప్రసాదం తయారీ, పంపిణీ ప్రాంతం మొత్తం హైజీనిక్ పద్ధతుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫస్ట్ ఎయిడ్ కిట్లను వెంటనే ఏర్పాటు చేయాలని, సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుని అన్ని పైప్లైన్లను సేఫ్టీ పరంగా పరిశీలించి అవసరమైన సర్వీసింగ్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
లడ్డూ ప్రసాదం నాణ్యతపై ప్రత్యేక తనిఖీ
అనంతరం స్వామివారి లడ్డూ ప్రసాదం తయారు చేసే విభాగాన్ని ఈవో పరిశీలించారు. ప్రసాదం తయారీ విధానం, పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పరిశీలించడంతో పాటు ప్రసాదం నాణ్యతను స్వయంగా రుచి చూసి తనిఖీ చేశారు. నాణ్యత ప్రమాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించకుండా నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈవో జల్లాపల్లి వెంకట్రావు మాట్లాడుతూ, భక్తుల సౌకర్యాలే ప్రథమ ప్రాధాన్యత గా సింహాచల క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడికి పరిశుభ్రమైన వాతావరణం, స్వచ్ఛమైన తాగునీరు, సౌకర్యవంతమైన క్యూ లైన్లు, నాణ్యమైన అన్నప్రసాదం అందించడమే దేవస్థానం ప్రధాన లక్ష్యమని తెలిపారు. భక్తుల నుంచి వచ్చే సూచనలు, సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ ప్రత్యేక తనిఖీల్లో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్చార్జి రామరాజు, తాతాజీ ఏఈఓ, వాడ్రేవు రమణమూర్తి, కె. తిరుమలేశ్వరరావు, పిల్లా శ్రీనివాస్, పర్యవేక్షణ అధికారి రాజ్యలక్ష్మి, పాలూరు నర్సింగరావు, ఇంజనీరింగ్ సిబ్బంది తిరుపతిరావు, రవిరాజ్, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
K.V.SHARMA EDITOR















Comments
Post a Comment