విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తా వాహిని:సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల లో ఆంధ్ర విశ్వవిద్యాలయం సహకారంతో “కృత్రిమ మేధస్సు ద్వారా అధ్యాపకులు, పరిశోధకుల సాధికారత – అంతరశాఖల అధ్యయనం” అనే అంశంపై మూడు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (FDP) బుధవారం కళాశాల సెమినార్ హాల్లో ప్రారంభమైందని కన్వీనర్ కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి శ్రీమతి కె. నాగ శిరీష తెలిపారు
ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలు–RUSA 2.0లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా అధ్యాపకులు, పరిశోధకులు కృత్రిమ మేధస్సు (AI), మెషిన్ లెర్నింగ్, డేటా ఆధారిత సాంకేతికతలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవడంతో పాటు, వాటిని బోధన, అభ్యాసం, పరిశోధనలో సమర్థవంతంగా వినియోగించే అవకాశాన్ని కల్పిస్తోంది.
ప్రారంభ సమావేశానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాశాల అభివృద్ధి మండలి (CDC) డీన్ ప్రొఫెసర్ టి.వి. కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. ఉన్నత విద్యా రంగంలో కృత్రిమ మేధస్సు విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందని, అధ్యాపకులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని బోధన, పరిశోధనలో సమర్థవంతంగా వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ షైజీ పి.డి. మరియు వైస్ ప్రిన్సిపాల్ డా. సిస్టర్ ఎస్. హేమ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి శ్రీమతి కె. నాగ శిరీష కన్వీనర్గా వ్యవహరించారు.
గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన డా. కింతలి మనోహర్, గాయత్రి విద్యా పరిషత్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన డా. ఎస్. కాంతి కిరణ్, అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (ANITS)కు చెందిన డా. దాసరి నాగతేజ్ రిసోర్స్ పర్సన్స్గా పాల్గొని కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, ఆధునిక సాంకేతిక అనువర్తనాలపై అధ్యాపకులకు శిక్షణ అందించారు.
మొత్తం 30 మంది అధ్యాపకులు, విద్యావేత్తలు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాల తరఫున కె. నాగ శిరీష, జి. దీప్తి, ఎస్. మాధురి, కుమ్కుమ్ ధారా, శ్రీమతి జె. అనితా రాణి, కె. ఎస్తేర్ లిల్లీ, టి. సుసాన్ సలోమి, శ్రీ ఎం. సందీప్ పాల్గొన్నారు.
ఈ మూడు రోజుల శిక్షణా కార్యక్రమం అధ్యాపకుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, కృత్రిమ మేధస్సు ఆధారిత బోధన, పరిశోధన, ఆవిష్కరణలకు కొత్త దిశను చూపనుందని నిర్వాహకులు తెలిపారు.





Comments
Post a Comment