శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం భక్తుల సౌకర్యాలపై ఈఓ జల్లేపల్లి వెంకట్రావు ప్రత్యేక దృష్టి సింహగిరిపై క్యూలైన్లు, వాష్రూములు, తాగునీటి వసతులపై క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీ
సింహాచలం, ఆగస్టు 20: శ్రీశ్రీశ్రీవరాహలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా గురువారం ఇంజనీరింగ్, సానిటరీ, అధికారుల బృందంతో కలిసితో కొండపై క్యూలైన్లు, వాష్రూములు, తాగునీటి వసతులు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా క్యూలైన్లలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన వాటర్ కూలర్లు, తాగునీటి నాణ్యత, నీటి రుచి, వాష్రూముల పనితీరు, పరిసరాల పరిశుభ్రతను ఈఓ స్వయంగా పరిశీలించారు. క్యూలైన్లలో ఏర్పాటు చేసిన వాటర్ కూలర్ల నుంచి స్వయంగా నీటిని తాగి నీటి నాణ్యతను పరిశీలించడం విశేషం. భక్తులకు అందుతున్న తాగునీటిలో ఎటువంటి లోపాలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
పుట్ట బంగారం ప్రాంతం నుంచి కిందికి భక్తులు సులభంగా రాకపోకలు సాగించేలా మెట్ల ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కుడివైపు బస్టాండ్కు దిగే భక్తులకు, బస్టాండ్ నుంచి కొండపైకి వచ్చే భక్తులకు ఉపయోగపడేలా నిర్మిస్తున్న మెట్ల పనుల పురోగతిని పరిశీలించారు. పనులను నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.
క్యూలైన్లలో ఉన్న ప్రతి గేటుకు ప్రత్యేక నంబర్ కేటాయించి, తాళాలు ఏర్పాటు చేయాలని ఈఓ సూచించారు. తాళాలపై కూడా గేటుకు సంబంధించిన నంబర్ ఉండేలా చూడాలని, అన్ని తాళాలను డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వద్ద అందుబాటులో ఉంచాలని ఏఈ రవిరాజును ఆదేశించారు. అవసరమైన సమయంలో గేట్లను సులభంగా గుర్తించి నిర్వహించేలా ఈ విధానం ఉండాలని తెలిపారు.
కొబ్బరికాయలు విక్రయించే వెండర్ షాపుల వద్ద తప్పనిసరిగా డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని ఈఓ స్పష్టం చేశారు. డస్ట్బిన్లు ఏర్పాటు చేయకపోతే సంబంధిత టెండర్ను రద్దు చేసే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాల వద్ద కూడా ప్రత్యేకంగా డస్ట్బిన్లు ఏర్పాటు చేసి వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని సానిటరీ సిబ్బందిని ఆదేశించారు.
గత వారం నిర్వహించిన తనిఖీల్లో సూచించిన పనుల అమలును కూడా ఈఓ పరిశీలించారు. సుభదా మండపంలో భక్తులకు కూలర్ల ద్వారా అందిస్తున్న తాగునీటి నాణ్యతను పరిశీలించి, నిరంతరం నాణ్యత ప్రమాణాలను పాటించాలని అధికారులకు సూచించారు.
పెండింగ్లో ఉన్న ఫ్యాబ్రికేటెడ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కళ్యాణ మండపం ఆవరణలో పేరుకుపోయిన వేస్ట్ మెటీరియల్ను తక్షణమే తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.
స్వామివారి ఆలయం వెనుక భాగంలో అర్చకుల సౌకర్యార్థం వాష్రూమ్, డ్రెస్ చేంజింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. భక్తులతో పాటు ఆలయ సిబ్బంది, అర్చకుల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని వసతులను మెరుగుపరచాలని తెలిపారు.
భక్తులకు అందించే ప్రతి సౌకర్యం పరిశుభ్రంగా, సక్రమంగా పనిచేసేలా అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఈఓ జల్లేపల్లి వెంకట్రావు స్పష్టం చేశారు. భక్తుల సంతృప్తి, సౌకర్యమే దేవస్థానం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ తనిఖీల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, సానిటరీ విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి పిల్లా శ్రీనివాస్, పర్యవేక్షణ అధికారి సిరిపరుపు కనకరాజు, ఇంజనీరింగ్ ఏఈలు రవిరాజు, తిరుపతిరావు, వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్, సింహగిరి శానిటరీ సొసైటీ, పద్మావతి శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.






Comments
Post a Comment