విశాఖపట్నంలో 'పి.వి. సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్' విజన్ను ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్, పి.వి.సింధు*
విశాఖపట్నం, ఆగస్టు 5, 2026:* విశాఖపట్నంలో 'పి.వి. సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్' ప్రాజెక్టుకు సంబంధించిన విజన్ను బ్యాడ్మింటన్ దిగ్గజం రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ , పి.వి.సింధు కలిసి ఆవిష్కరించారు. భారతదేశంలో క్రీడారంగ అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఈ చారిత్రాత్మక లాభాపేక్ష లేని (నాన్-ప్రాఫిట్) సంస్థను అధికారికంగా ప్రారంభించారు. రెండు ఒలింపిక్ పతకాల విజేత, ప్రపంచ ఛాంపియన్ మరియు పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి.వి. సింధు ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఈ కేంద్రాన్ని ఒకే క్యాంపస్లో సమగ్ర క్రీడా మరియు విద్యా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ఏడు రకాల క్రీడా విభాగాలు, ఉన్నత స్థాయి శిక్షణ (హై-పెర్ఫార్మెన్స్ కోచింగ్), స్పోర్ట్స్ సైన్స్, రికవరీ, సదుపాయాలు, పోషకాహారం, శారీరక దృఢత్వం (స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్) మరియు విద్యాభ్యాసాన్ని ఒకేచోట అందిచనున్నారు.
ఈ కార్యక్రమం కేవలం శంకుస్థాపనకు మాత్రమే పరిమితం కాలేదు. బేస్మెంట్ పనులు ఇప్పటికే పూర్తి కావడంతో పాటు భవన నిర్మాణ పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడితో జరిగిన చర్చల తర్వాత ఈ ప్రాజెక్టు స్వరూపం మరింత విస్తరించింది. రాబోయే కొద్ది సంవత్సరాల గురించే కాకుండా, రాబోయే వందేళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించాలని సింధు మరియు ఆమె భర్త వెంకట దత్త సాయికి ఆయన సూచించారు. అలా మొదట్లో కేవలం ఒక బ్యాడ్మింటన్ అకాడమీగా రూపుదిద్దుకున్న ఈ ఆలోచన, తరతరాల అథ్లెట్లకు మరియు విద్యార్థులకు సేవలందించేలా ఒక సుదీర్ఘ కాల పరిమితి కలిగిన మహోన్నత సంస్థగా రూపాంతరం చెందింది.
ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి క్రీడా ప్రాంగణాలైన దోహాలోని ‘అస్పెటార్’(Aspetar), భారత్లోని ‘ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్’ వంటి సంస్థల సందర్శనల నుంచి ప్రేరణ పొంది ఈ కేంద్రాన్ని రూపుదిద్దారు. నాణ్యమైన శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్, అథ్లెట్ల రికవరీ సదుపాయాలు, విద్య మరియు క్రీడా సంస్కృతి.. వీటిని ఒకేచోట అనుసంధానించడం ద్వారానే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతారనే విశ్వాసంతో దీని రూపకల్పన జరిగింది. దాదాపు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాంగణంలో అంతర్జాతీయ స్థాయి వసతులను అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో ప్రత్యేకమైన బ్యాడ్మింటన్ కోర్టులు, 25 మీటర్ల స్విమ్మింగ్ పూల్, ఏపీలోనే తొలిసారిగా అందుబాటులోకి వస్తున్న 25 మీటర్ల షూటింగ్ రేంజ్, అనుసంధానిత స్పోర్ట్స్ సైన్స్ మరియు రికవరీ కేంద్రాలు ఉంటాయి. వీటితో పాటు క్యాంపస్లోనే పాఠశాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల యువ అథ్లెట్లు చదువును, క్రీడలను రెండింటినీ సమతుల్యంగా కొనసాగించడానికి వీలవుతుంది.
విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం, ఆ నగరానికి క్రీడలు, విద్య మరియు ఉన్నత స్థాయి శిక్షణకు (హై-పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్) సంబంధించిన ఒక జాతీయ చిరునామాగా గుర్తింపు తీసుకురానుంది. దీనిద్వారా మెరుగైన శిక్షణ, కొత్త ప్రతిభ గుర్తింపు, పరిశోధన భాగస్వామ్యాలు మరియు కమ్యూనిటీ కార్యక్రమాల ద్వారా యువతకు విస్తృత అవకాశాలను కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా పద్మభూషణ్ పి.వి. సింధు మాట్లాడుతూ, “భారతీయ క్రీడారంగానికి నేను అందిస్తున్న కానుక ఈ కేంద్రం. రాబోయే తరాలకు గొప్ప అవకాశాలను సృష్టించే ఒక మహోన్నత సంస్థను నిర్మించడం కోసం నా క్రీడా జీవితంలో నేను సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగాన్ని కేటాయిస్తున్నాను. యువ అథ్లెట్లకు ప్రపంచ స్థాయి శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్, విద్య మరియు వారి పూర్తి సామర్థ్యాన్ని బయటకు తీసేందుకు కావలసిన మద్దతు లభించే ఒక చక్కటి వాతావరణాన్ని తయారు చేయడమే నా కల. రాబోయే తరాలకు సేవలందించే ఈ పవిత్ర ఆశయంలో కార్పొరేట్ సంస్థలు, విరాళాలు ఇచ్చే దాతలు కూడా సీఎస్ఆర్ (CSR) మరియు సుదీర్ఘ భాగస్వామ్యాల ద్వారా మాతో చేయి కలపాలని కోరుతున్నాను” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) శాఖల గౌరవ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. “ప్రపంచ క్రీడా వేదికలపై పి.వి.సింధు సాధించిన అద్భుతమైన విజయాలు భారత్కి ఎంతో ఖ్యాతిని తీసుకువచ్చాయి. పి.వి. సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ స్థాపన ద్వారా, రాబోయే తరం విజేతలను ప్రోత్సహిస్తూ, తీర్చిదిద్దుతూ ఆమె ఒక శాశ్వతమైన ఆదర్శాన్ని (లెగసీ) నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి మౌలిక వసతులు మరియు యువ ప్రతిభకు గొప్ప అవకాశాలు ఉన్న అగ్రగామి క్రీడా ప్రాంతంగా మార్చాలనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం భాగస్వామి కావడం ఎంతో గర్వకారణం. క్రీడల్లో రాణించాలనుకునే ప్రతి ఒక్క అథ్లెట్ పెద్ద కలలు కని, అత్యుత్తమ శిక్షణ పొంది, దేశానికి ప్రాతినిధ్యం వహించేలా ఒక బలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే అనేక తరాల భారతీయ క్రీడల భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ స్ఫూర్తిదాయక ప్రయత్నాన్ని ప్రారంభించిన సింధుకు, ఆమె కుటుంబ సభ్యులకు మరియు ఇందులో భాగస్వాములైన అందరికీ నా హృదయపూర్వక అభినందనలు” అని పేర్కొన్నారు.
ఈ కేంద్రం నిర్మాణ పనులు 2028 మే నాటికి పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. ఆ సమయానికి మొదటి తరం అథ్లెట్లు మరియు విద్యార్థులకు ఇది స్వాగతం పలకనుంది.
K.V.SHARMA EDITOR






Comments
Post a Comment