యువతకు ఉద్యోగాలు ఇచ్చే అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ రెడ్డి ముఠా* *▪️ ఐదేళ్ల పాలనలో 900కు పైగా పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేసిన జగన్ ప్రభుత్వం* *▪️ చంద్రబాబు విజన్, లోకేష్ కృషితో పెట్టుబడుల వరద… ‘బ్రాండ్ ఆంధ్ర’గా అవతరిస్తున్న ఏపీ* *— టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు*
*పరిశ్రమలపై వైసీపీ కుట్రలు*
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలను తరిమేసి, పెట్టుబడిదారుల్లో భయాన్ని నింపిన ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వమేనని పల్లా ఘాటు గా విమర్శించారు. జగన్ రెడ్డి హయాంలో 913 కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయని తెలిపారు. పీసీబీఎల్ కర్నాటకకు, ప్రీమియర్ ఇంజనీరింగ్ తెలంగాణకు తరలిపోవడం పెట్టుబడిదారులు ఎదుర్కొన్న హరాస్మెంట్, కమిషన్ డిమాండ్లు, అనిశ్చిత పరిస్థితులకు నిదర్శనమన్నారు.
జగన్ రెడ్డి పాలనలో పరిశ్రమలు పారిపోతే… ఇప్పుడు విజనరీ లీడర్ చంద్రబాబు పాలనలో వస్తున్న పెట్టుబడులపై కుట్రలు పన్నడం జగన్ రెడ్డి రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ల్యాండ్ పాలసీపై కోర్టులో కేసు వేయగా రాయితీలు లేకుండా పరిశ్రమలు ఎలా వస్తాయని హైకోర్టే ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు వైసీపీ ఎంపీ మద్దిలా గురుమూర్తి భూముల కేటాయింపులపై పిల్ వేసి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.
*జగన్ హయాంలో పారిపోయిన పరిశ్రమలు*
2014-19 మధ్య రాష్ట్రానికి వచ్చిన కంపెనీల్లో సగానికి పైగా సంస్థలను జగన్ రెడ్డి ప్రభుత్వం తరిమేసిందని పల్లా అన్నారు. టీసీఎస్, కియా అనుబంధ పరిశ్రమలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్ఎస్బీసీ, లులూ, బీఆర్ పెట్టి గ్రూప్స్, ఏపీపీ పేపర్ పరిశ్రమ, సింగపూర్ స్టార్లర్లు వంటి అనేక సంస్థలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లాయని తెలిపారు. దశాబ్దాలుగా రాష్ట్రానికి ఆదాయ వనరుగా నిలిచిన అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీని కూడా రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని అన్నారు.
సుమారు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను తరిమేసిన ప్రభుత్వంగా వైసీపీ చరిత్రలో నిలిచిందని, దాని ఫలితంగా రాష్ట్రంలో నిరుద్యోగిత 24 శాతం వరకు పెరిగిందని పల్లా పేర్కొన్నారు. సంక్షేమం పేరిట మాటలు చెప్పినా అభివృద్ధి మాత్రం శూన్యంగా మిగిలిందన్నారు.
*పారిశ్రామిక రంగానికి రెక్కలు… యువత భవిష్యత్తుకు వెలుగులు*
వైసీపీ పాలనలో పూర్తిగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వ్యవస్థను కేవలం 20 నెలల్లోనే పునరుద్ధరించి “బిల్డప్ ఆంధ్ర” నుంచి “బ్రాండ్ ఆంధ్ర”గా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని పల్లా తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నిరంతర కృషి, పట్టుదల, గ్లోబల్ అవుట్రీచ్ వల్లే నేడు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు స్వర్గధామంగా మారిందని చెప్పారు.
దేశంలోనే అత్యుత్తమమైన 25 పారిశ్రామిక విధానాలను అమలు చేసి, దేశ విదేశాల్లో స్వయంగా పర్యటిస్తూ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచిన ప్రభుత్వం ఇదేనన్నారు. కేవలం 20 నెలల్లోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 25 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు.
సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా విశాఖ నుంచే ప్రపంచానికి బలమైన సంకేతం పంపామని, రూ.13.25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు, 16.13 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించేలా 610 ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. పరిశ్రమ & వాణిజ్య శాఖకు రూ.3,161 కోట్లు బడ్జెట్లో కేటాయించడం, 40,862 పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు చెల్లించేందుకు రూ.1,528.25 కోట్లు కేటాయించడం ద్వారా ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యం స్పష్టమవుతోందన్నారు. పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.400.37 కోట్లు కేటాయించడం పెట్టుబడులకు మరింత అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుందని చెప్పారు.
*గూగుల్తో విశాఖకు ఏఐ రాజధాని*
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ను విశాఖకు తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ గారి పాత్ర చారిత్రాత్మకమని పల్లా అన్నారు. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఏఐ సిటీ ఏర్పడబోతోందని, దేశంలోనే తొలి ఏఐ హబ్గా విశాఖ నిలవబోతుందని తెలిపారు. టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వా, రహేజా వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు కూడా విశాఖలో పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు.
విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్ రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడితో రానుండగా, ఎఎంజెడ్ గ్రూప్ సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించిందన్నారు. అనంతపురంలో రెన్యూ విక్రమ్, చిండా వంటి కంపెనీలు పునర్వినియోగ శక్తి రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. అనకాపల్లిలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ను బిర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఏర్పాటు చేయబోతోందన్నారు.
దేశవ్యాప్తంగా ప్రకటించిన పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే 25.3 శాతం వాటాను సొంతం చేసుకోవడం రాష్ట్రంపై ప్రపంచానికి వచ్చిన నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి రూ.28 వేల కోట్లు కేటాయించామని చెప్పారు.
*ప్రతి జిల్లాకు ప్రత్యేక అభివృద్ధి హబ్*
రాష్ట్రాన్ని సమతుల్యంగా అభివృద్ధి చేయడానికి ప్రతి ప్రాంతానికి ప్రత్యేక పారిశ్రామిక హబ్లను రూపొందిస్తున్నామని పల్లా తెలిపారు. ఉమ్మడి విశాఖను ఐటీ, ఏఐ హబ్గా, శ్రీకాకుళాన్ని ఫిషరీస్ మరియు కోస్టల్ లాజిస్టిక్స్ హబ్గా, గోదావరి జిల్లాలను పోర్ట్ బేస్డ్ పెట్రో కెమికల్స్ హబ్గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కృష్ణ జిల్లాను ఫైనాన్స్, లాజిస్టిక్స్ హబ్గా, గుంటూరును క్వాంటం, డ్రోన్, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
ప్రకాశం జిల్లాలో ఫార్మా కెమికల్స్ హబ్, నెల్లూరులో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ హబ్, చిత్తూరులో మాన్యుఫాక్చరింగ్ మరియు టూరిజం హబ్, అనంతపురంలో పునర్వినియోగ శక్తి హబ్, కడపలో ఐటీ స్టార్టప్ హబ్, కర్నూలులో డిఫెన్స్ మరియు ఎయిరోస్పేస్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుండటాన్ని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు పెట్టుబడులపై విషం చిమ్ముతున్నారని పల్లా విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే కూటమి ప్రభుత్వ సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు.

Comments
Post a Comment