విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం... ...నెరవేరిన విశాఖ ప్రజల కల.. ...ప్రధాని మోదీకి,కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ఏపీ బీజేపీ అధ్యక్షులు పివియన్ మాధవ్ కృతజ్ఞతలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2019 ఫిబ్రవరి 17న విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, అదే నెల 28న కేంద్ర కేబినెట్ దీనికి సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపీఆర్ )కు ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు.
జోన్కు శాశ్వత ప్రధాన కార్యాలయం నిర్మాణానికి 2025 జనవరి 8న భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ముడసర్లోవలో శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. సుమారు రూ.183 కోట్లకు పైగా అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపొందించినట్లు పేర్కొన్నారు.
విశాఖపట్నంలోని ముడసర్లోవలో 52.2 ఎకరాల విస్తీర్ణంలో విశాఖ సముద్ర తీరానికి ప్రతీకగా క్రూయిజ్ ఆకారంలో ఆధునిక సదుపాయాలతో కూడిన 12 అంతస్తుల ప్రధాన కార్యాలయ భవనం నిర్మాణం రూ.107 కోట్ల తో కొనసాగుతోందని తెలిపారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు విఎంఆర్ డి ఏ ఐకానిక్ “ది డెక్” భవనం నుంచి తాత్కాలికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుమాధవ్ తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రం లో దక్షిణ మధ్యరైల్వే జోన్ గా ఉన్న రైల్వే జోన్, విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో విశాఖపట్నం డివిజన్ (పాత వాల్తేర్ డివిజన్ నుంచి విడదీసినది), విజయవాడ, గుంటూరు, గుంటకల్ డివిజన్లు ఉండనున్నాయని, ఈ జోన్ ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కొన్ని ప్రాంతాలను కూడా కలుపుకుంటుందని తెలిపారు.
భూసేకరణ వంటి కారణాలతో ఆలస్యం అయిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం వేగవంతంగా అమలులోకి వచ్చిందని, జనరల్ మేనేజర్ నియామకం పూర్తయ్యి నిర్మాణ పనులు పురోగమిస్తున్నాయని పేర్కొన్నారు.
విశాఖ రైల్వే జోన్ ప్రారంభం ద్వారా రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతులు మెరుగుపడటంతో పాటు, కొత్త రైళ్ల మంజూరు, ప్లాట్ ఫారమ్ విస్తరణతో పాటు ,15 వేలకు పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలు మరియు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని పీవీఎన్ మాధవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు

Comments
Post a Comment