చంద్రబాబు పాయకరావుపేట నియోజకవర్గం పర్యటన నేపథ్యంలో సమీక్ష సమావేశం* *భారీ స్థాయిలో స్వాగత ఏర్పాట్లు చేయాలి* *కూటమి నాయకులంతా బాధ్యత తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి*... *మంత్రులు*
నక్కపల్లి, మర్చి 16:- ఈ నెల 23న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాయకరావుపేట నియోజకవర్గం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై సోమవారం నక్కపల్లిలో హోం మంత్రి వంగలపూడి అనిత నివాసంలో కూటమి నేతల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి అనిత, అనకాపల్లి జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లి రవీంద్ర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భద్రతా బందోబస్తు, కార్యక్రమ నిర్వహణపై విస్తృతంగా చర్చించారు. పర్యటనకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో జనసమీకరణ, ఆహారం, రవాణా తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి తొలిసారి పాయకరావుపేటకు వస్తున్న నేపథ్యంలో భారీ స్థాయిలో స్వాగత ఏర్పాట్లు చేయాలని హోం మంత్రి అనిత అధికారులకు సూచించారు. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులతో జిల్లాలో వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రణాళికలను ప్రభుత్వం అమలు చేస్తోందని, ఈ లక్ష్యాలను ప్రజలందరికీ తెలియజేసేలా కార్యక్రమ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. కూటమి నాయకులంతా బాధ్యత తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ ఆశయాలు, ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో జోన్-1 కోఆర్డినేటర్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, కార్పొరేషన్ చైర్మన్లు మల్ల సురేంద్ర, పి.జి.వి.ఆర్ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.




Comments
Post a Comment