క్రైస్తవంలోకి మారినందున ఎస్సీ, ఎస్టీ రక్షణ కావాలని పాస్టర్ పిటిషన్
ఈ కేసు చింతడ ఆనంద్ అనే పాస్టర్కు సంబంధించింది. తాను క్రైస్తవ మతంలోకి మారి, గత పదేళ్లుగా పాస్టర్గా సేవలు అందిస్తున్నప్పటికీ, తనపై జరిగిన దాడి విషయంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద రక్షణ కల్పించాలని ఆయన కోరారు. అయితే, ఆయన బహిరంగంగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారని, ప్రార్థనలు నిర్వహిస్తున్నారని ఆధారాలతో నిరూపితమైంది. దీంతో, ఆయనపై జరిగిన దాడికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదని ఏపీ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
రాజ్యాంగ నిబంధనల వివరణ:
రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వు ప్రకారం.. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతం కాకుండా ఇతర మతాలకు మారిన వ్యక్తి షెడ్యూల్డ్ కుల సభ్యునిగా పరిగణించరు. ఒక వ్యక్తి క్రైస్తవ లేదా ఇస్లాం మతంలోకి మారినప్పుడు, సదరు మతాల్లో కుల వివక్ష లేదని భావిస్తారు కాబట్టి, వారు ఎస్సీ హోదాను కోల్పోతారని ధర్మాసనం వివరించింది. కేవలం ఎస్సీ సర్టిఫికేట్ కలిగి ఉన్నంత మాత్రాన, ఆచరణలో వేరే మతాన్ని అనుసరిస్తుంటే ఆ హోదా చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది.
అట్రాసిటీ చట్టం వర్తింపు
ఈ తీర్పు వల్ల కలిగే ప్రధాన ప్రభావం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై ఉంటుంది. ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారినట్లు నిర్ధారణ అయితే, ఆ వ్యక్తిపై జరిగే దాడులు లేదా అవమానాల విషయంలో అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయడం సాధ్యపడదని కోర్టు స్పష్టం చేసింది. నిందితులు తమపై ఉన్న ఎస్సీ చట్టం కేసులను కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సందర్భంగా కోర్టు ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. మత మార్పిడి చేసుకున్న తర్వాత సదరు వ్యక్తి తిరిగి తన స్వమతంలోకి మారినట్లు ఆధారాలు ఉంటే తప్ప, ఎస్సీ హోదా పునరుద్ధరించకూడదని ధర్మాసనం పేర్కొంది.
ఈ తీర్పుతో సంచలన మార్పులు
ఈ తీర్పు దేశవ్యాప్తంగా మత మార్పిడి చేసుకున్న దళితుల రిజర్వేషన్లు , ఇతర చట్టపరమైన రక్షణలపై చర్చకు దారితీసే అవకాశం ఉంది. న్యాయపరంగా ఇది ఒక కీలకమైన మైలురాయిగా నిలవనుంది. మత మార్పిడి చేసుకున్న ఎంతో మందిఇప్పటికీ ఎస్సీ రిజర్వేషన్లు పొందుతున్నారు. ఎస్సీ , ఎస్టీ చట్టం కింద రక్షణ పొందుతున్నారు.

Comments
Post a Comment