పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేసిన శ్రీ సత్యసాయి విద్యా విహార్ విద్యార్థులు- స్వయంగా మట్టి గణేశ విగ్రహాల తయారీ – పర్యావరణ హితమైన వినాయక చవితికి సందేశం*


విశాఖపట్నం: మానవతా విలువలతో కూడిన ఉన్నతమైన విద్యను అభ్యసించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతను పెంపొందించుకుంటూ శ్రీ సత్యసాయి విద్యా విహార్ స్కూలు విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు.

వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషిగా, స్కూలు కన్వీనర్, యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది ప్రేరణతో విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో స్వయంగా మట్టి గణేశ విగ్రహాలను తయారు చేస్తున్నారు.

విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో మట్టితో గణేశ విగ్రహాలను రూపొందిస్తూ, పర్యావరణ పరిరక్షణపై అవగాహనను ఆచరణలో చూపిస్తున్నారు. అనంతరం వారు తయారు చేసిన మట్టి గణేశ విగ్రహాలను ప్రేమపూర్వకంగా స్కూలు ఉన్న ఎం.వి.పి. పరిసర ప్రాంతాల ప్రజలకు బహుకరిస్తారు.

గత పది సంవత్సరాలకు పైగా శ్రీ సత్యసాయి విద్యా విహార్ విద్యార్థులు ఈ పర్యావరణహిత కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 300 మట్టి గణేశ విగ్రహాలను విద్యార్థులు స్వయంగా తయారు చేయడం విశేషం.


మట్టి గణేశ విగ్రహాల వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ప్రకృతి పట్ల ప్రేమ, సామాజిక బాధ్యత, సేవాభావం వంటి విలువలను విద్యార్థుల్లో పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

“విద్య అంటే కేవలం జ్ఞానాన్ని పొందడం కాదు… మానవతా విలువలతో పాటు ప్రకృతిని ప్రేమించి, సంరక్షించే బాధ్యతను నేర్చుకోవడం కూడా.”


శ్రీ సత్యసాయి విద్యా విహార్ విద్యార్థుల ఈ పర్యావరణహిత కార్యక్రమం “ప్రేమతో సేవ – బాధ్యతతో పరిరక్షణ” అనే సందేశాన్ని సమాజానికి అందిస్తోంది.

Post a Comment

0 Comments