తాగునీటి మౌలిక వసతులను సమగ్రంగా తనిఖీ చేసి మెరుగుపరచాలని జోనల్ రైల్వేలకు సూచన; స్టేషన్ వారీగా గుర్తించిన లోపాలపై తీసుకున్న చర్యలను పర్యవేక్షించనున్నారు
స్టేషన్లలో ప్రయాణికులకు సురక్షితమైన, పరిశుభ్రమైన తాగునీరు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడడానికి భారతీయ రైల్వే నీటి ట్యాంకులు మరియు ఫిల్టర్లను శుభ్రపరచి, క్రిమిసంహారక చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది.
భారతీయ రైల్వేలో తాగునీటి నాణ్యత నిర్వహణను మరింత బలోపేతం చేయడానికి రూపొందించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యాచరణ ప్రణాళికలో మొత్తం తాగునీటి సరఫరా వ్యవస్థను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం, నిర్వహణ చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించారు. నీటి వనరు మరియు వినియోగ ప్రాంతం వద్ద మాత్రమే కాకుండా, పైప్లైన్ చివరి దశలో కూడా నీటి నాణ్యతను పరీక్షించడంపై ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ ప్రత్యేక కార్యక్రమంలో జోనల్ రైల్వేలు నీటి వనరులు, నీటి శుద్ధి మరియు వడపోత ప్లాంట్లు, భూగర్భ మరియు ఓవర్హెడ్ ట్యాంకులు, PVC ట్యాంకులు, వాటర్ బూత్లు, కుళాయిలు మరియు నీటి పంపిణీ కేంద్రాలను సమగ్రంగా తనిఖీ చేస్తాయి. అన్ని నీటి ట్యాంకులను పూర్తిగా ఖాళీ చేసి, శుభ్రపరిచిన అనంతరం క్రిమిసంహారక చర్యలు చేపడతారు. అంతేకాకుండా, వెంట్లు మరియు ఓవర్ఫ్లో ప్రాంతాలను పక్షులు, జంతువులు మరియు శైవలాల నుంచి రక్షించేందుకు తగిన భద్రతా చర్యలు తీసుకుంటారు.
ఈ కార్యక్రమంలో మరమ్మతులు లేదా ఇతర సరిదిద్దే చర్యలు అవసరమైన లోపాలను గుర్తిస్తారు. దెబ్బతిన్న ట్యాంకులు, పైప్లైన్లు మరియు ఫిల్టర్లను అవసరాన్ని బట్టి మరమ్మతు చేయడం లేదా మార్చడం జరుగుతుంది. తాగునీరు మరియు తాగడానికి పనికిరాని నీటి సరఫరా వ్యవస్థల మధ్య ఎలాంటి క్రాస్-కనెక్షన్ లేకుండా చర్యలు తీసుకుంటారు. తాగునీటి సరఫరాలో ఉపయోగించే అన్ని పైపుల్లో లీకేజీలను తనిఖీ చేసి, నీటి వృథాను అరికట్టేందుకు అవసరమైన సరిదిద్దే చర్యలు చేపడతారు.
తాగునీటి కోసం హ్యాండ్పంపులు మరియు బోర్వెల్లను ఉపయోగిస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. వీటి ద్వారా లభించే నీరు తాగడానికి సురక్షితంగా ఉండేలా జోనల్ రైల్వేలు నిర్ధారిస్తాయి.
నీటి నాణ్యత నిర్వహణను బలోపేతం చేయడం
సమగ్ర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, వాటర్ కూలర్లు మరియు నీటి శుద్ధి వ్యవస్థలను సమగ్రంగా తనిఖీ చేయాలని రైల్వే బోర్డు జోనల్ రైల్వేలకు సూచించింది. కూలర్లలోని నీటి ట్యాంకులను పూర్తిగా శుభ్రపరచడంతో పాటు, కూలర్లు, పైప్లైన్లు మరియు కుళాయిలలో ఏర్పడే లీకేజీలను వెంటనే సరిచేయాలి. వాటర్ కూలర్ల పంపిణీ ప్రాంతాల చుట్టూ శతశాతం పరిశుభ్రతను నిర్ధారించాలి.
వాటర్ కూలర్లకు సంబంధించిన UV/RO వ్యవస్థలను సమగ్రంగా తనిఖీ చేసి, అవసరమైన చోట వాటిని ఏర్పాటు చేయాలి. నిర్ణీత నిర్వహణ, సర్వీసింగ్, మరమ్మతులు, ఫిల్టర్ క్యాండిల్స్ మరియు ఇతర భాగాల మార్పిడిని సకాలంలో చేపట్టాలి. కొత్తగా ఏర్పాటు చేయాల్సిన లేదా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాల్సిన UV/RO వ్యవస్థలను వాటి పరిస్థితి మరియు అవసరాన్ని బట్టి మిషన్ మోడ్లో అమలు చేయాలి.
శుభ్రత మరియు నాణ్యత పర్యవేక్షణకు నిర్దేశించిన చర్యలను వాటర్ వెండింగ్ మెషీన్లకు కూడా వర్తింపజేస్తారు. ఈ సదుపాయాల ద్వారా పంపిణీ చేసే తాగునీరు అవసరమైన భద్రతా మరియు పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటారు.
అధికారులు గుర్తించిన ప్రాంతాల నుంచి నీటి నమూనాలను సేకరించి భౌతిక, రసాయనిక మరియు బ్యాక్టీరియా పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో నీటి వనరు, శుద్ధి అనంతర అవుట్లెట్, ట్యాంకులు, కూలర్లు, వెండింగ్ మెషీన్లు, కుళాయిలు మరియు వాటర్ బూత్ల నుంచి తీసుకునే నమూనాలు ఉంటాయి. ప్రతిరోజూ అవశిష్ట క్లోరిన్ స్థాయిని పర్యవేక్షిస్తారు. అవసరమైనప్పుడు వెంటనే రీక్లోరినేషన్ లేదా ఇతర సరిదిద్దే చర్యలు చేపడతారు.
మౌలిక వసతుల పర్యవేక్షణ మరియు సరిదిద్దే చర్యలు
ప్రస్తుతం ఉన్న ఓవర్హెడ్ మరియు భూగర్భ నీటి ట్యాంకుల స్థానంలో కొత్త ట్యాంకులను ఏర్పాటు చేయడం, అలాగే కొత్త ట్యాంకుల నిర్మాణానికి ఇప్పటికే మంజూరైన పనులను పర్యవేక్షించి వేగవంతం చేయాలని రైల్వే బోర్డు జోనల్ రైల్వేలను ఆదేశించింది. మంజూరైన పనుల సమగ్ర వివరాలను కూడా సిద్ధం చేయాలి. అవసరమైన చోట కొత్త పనులకు అనుమతుల ప్రక్రియను ప్రారంభించాలి.
తాగునీటి సరఫరా వ్యవస్థలోని వివిధ దశల్లో నీటి కలుషితాన్ని గుర్తించి నివారించేందుకు, నీటి వనరు మరియు తుది వినియోగ స్థానం (కుళాయి) వద్ద వివిధ పరిస్థితులకు అనుగుణంగా తగిన వ్యవస్థలను అభివృద్ధి చేసే చర్యలు కూడా చేపడుతున్నారు.
జోనల్ రైల్వేలు గుర్తించిన లోపాలు మరియు వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యల స్టేషన్ వారీ వివరాలను సమర్పించాలి. దీని ద్వారా లోపాలను క్రమబద్ధంగా పర్యవేక్షించడంతో పాటు, ప్రత్యేక కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించేలా చూడవచ్చు.
ఈ కార్యాచరణ ప్రణాళికలో రైల్వే కాలనీలు మరియు కార్యాలయాలు/పనిచేసే ప్రదేశాల్లోని తాగునీటి మౌలిక వసతులకు కూడా ఇదే తరహా చర్యలను అమలు చేయాలని ప్రతిపాదించారు. తద్వారా సురక్షితమైన, పరిశుభ్రమైన తాగునీటిపై దృష్టి ప్రయాణికుల ప్రాంతాలకే పరిమితం కాకుండా రైల్వే సిబ్బంది వినియోగించే ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది.
ఈ సమన్వయ చర్యల ద్వారా భారతీయ రైల్వేలు తాగునీటి సరఫరా వ్యవస్థలో ముందస్తు తనిఖీలు, మౌలిక వసతుల నిర్వహణ, పరిశుభ్రత, నీటి నాణ్యత పరీక్షలు మరియు సరిదిద్దే చర్యల వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నాయి.
ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రయాణికులు మరియు రైల్వే ఉద్యోగులకు సురక్షితమైన, పరిశుభ్రమైన తాగునీరు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.

0 Comments