విశాఖపట్నం, ఆగస్టు 24: నేత్రదానం ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం నేత్రదానంపై అవగాహన పోస్టర్ను సంబంధిత అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నిర్వహించనున్న 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రజల్లో నేత్రదానంపై విస్తృత అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా సూచించారు. మరణానంతరం నేత్రాలను దానం చేయడం ద్వారా ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించే అవకాశం ఉంటుందన్నారు. అపోహలను తొలగించి, ప్రజలను స్వచ్ఛందంగా నేత్రదానానికి ముందుకు వచ్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నేత్రదానం చేయాలనే సంకల్పాన్ని కుటుంబ సభ్యులకు ముందుగానే తెలియజేయడం ద్వారా మరణానంతరం నేత్రదానం సులభంగా జరిగేలా చూడవచ్చని పేర్కొన్నారు.
డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, ప్రభుత్వ రీజనల్ కంటి ఆసుపత్రి సూపరింటిండెంట్ డా. మీనాక్షి, డీఎంహెచ్వో డా. జగదీశ్వరరావు, ఎన్టీఆర్ వైద్యసేవ కో-ఆర్డినేటర్ అప్పారావు, డీసీహెచ్ఎస్ డా. నరేంద్ర సింగ్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, నేత్రదాన సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

0 Comments