. SRINIVAS SPL Correspondent
అమలాపురం, విశాఖ సందేసం...అమలాపురం పురపాలక సంఘం పరిధిలో అధికారులు ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియ తీవ్ర అభ్యంతరకరంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విముక్తి చిరుతల పార్టీ (VCK) రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ ఆరోపించారు. అమలాపురం కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ను కలసి పార్టీ బృందంతో కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీవో నంబరు 1113 ప్రకారం ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు మున్సిపల్ అధికారులు ప్రతీ వార్డులోనూ ఇంటింటికీ తిరిగి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మహిళా ఓటర్ల వివరాలను పారదర్శకంగా సేకరించాల్సి ఉందని గుర్తుచేశారు. కానీ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా, కార్యాలయాల్లో కూర్చొని బోగస్ రీతిలో జాబితాలు తయారు చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2020 సంవత్సరపు ఓటర్ల గణాంకాలతో ప్రస్తుతం విడుదల చేసిన జాబితాను పోల్చి చూస్తే తీవ్ర వ్యత్యాసాలు స్పష్టమవుతున్నాయని బొంతు రమణ పేర్కొన్నారు. 2020లో 454 మంది ఉన్న ఎస్టీ ఓటర్లను ప్రస్తుతం 581కి పెంచి 73 మంది పెంపు నమోదు చేశారని తెలిపారు. అలాగే 5,034 మంది ఉన్న ఎస్సీ ఓటర్లను ప్రస్తుతం 5,093 మందిగా చూపి కేవలం 61 మంది మాత్రమే పెరిగినట్లు లెక్కలు తేల్చారన్నారు. ఇదే సమయంలో 20,206 మంది ఉన్న ఓసీ ఓటర్ల సంఖ్యను ఏకంగా 21,194కి పెంచి 988 మందిని అదనంగా చేర్చడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. అన్ని వర్గాల జనాభా పెరుగుతుంటే ఒక్క బీసీ ఓటర్ల సంఖ్యలోనే తీవ్ర కోత విధించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 2020లో 14,341 మంది ఉన్న బీసీ ఓటర్లు ప్రస్తుతం 14,211 మంది మాత్రమే ఉన్నట్లు చూపి, ఏకంగా 130 మంది తగ్గారని పేర్కొనడం అధికారుల అపారదర్శకతకు నిదర్శనమన్నారు. జనాభా పెరిగినప్పటికీ బీసీ ఓటర్ల సంఖ్యను తగ్గించడం, ఎస్సీ ఓటర్ల సంఖ్యను జనాభా నిష్పత్తికి తగినట్లుగా పెంచకపోవడం వల్ల రాబోయే ఎన్నికల్లో ఆయా వర్గాలు రాజ్యాంగం కల్పించిన రాజకీయ రిజర్వేషన్ హక్కులను దారుణంగా కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బీసీ సామాజికవర్గానికి చెందిన మంత్రి, ముగ్గురు ఎస్సీ శాసనసభ్యులు ఉన్నప్పటికీ, మున్సిపల్ రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా వ్యవహారంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మౌనం వహించడం శోచనీయమన్నారు. ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, ఎస్సీ, బీసీ వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం దక్కాల్సిన చట్టబద్ధమైన రిజర్వేషన్ హక్కులు లభించేలా అధికారులపై ఒత్తిడి చేసి న్యాయం చేయాలని కోరారు.ప్రస్తుతం ప్రచురించిన అక్రమ ఓటర్ల ముసాయిదా, రిజర్వేషన్ల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని VCK నాయకులు డిమాండ్ చేశారు. జీవో 1113 నిబంధనల ప్రకారం మున్సిపల్ సిబ్బందితో క్షేత్రస్థాయిలో నిజాయితీగా, పారదర్శకమైన రీ-సర్వే నిర్వహించాలని కోరారు. గణాంకాల తారుమారుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బడుగు, బలహీన వర్గాలు తమ రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ హక్కులను కోల్పోకుండా పక్కా గణాంకాలతో సరైన రీతిలో రిజర్వేషన్లు ఖరారు చేయాలని బొంతు రమణ కోరారు. ఈ కార్యక్రమంలో.... వి సి కే పార్టీ జిల్లా అధ్యక్షులు మెండి డేవిడ్ అంబేద్కర్, జల్లి అజయ్ పాల్గొన్నారు

0 Comments